Monday, July 4, 2016

కొలువుల పండగే

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా భర్తీ చేయనున్న గ్రూపు-2 పోస్టుల సంఖ్య భారీఎత్తున పెరగనుంది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలకు అవసరమైన పోస్టులను కూడా ఇందులో కలిపి పరీక్షలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దసరా నుంచి కొత్త జిల్లాలు ప్రారంభం కానుండగా ఆ తర్వాతే పోస్టులను గుర్తించి వాటి భర్తీకి పరీక్షలు జరిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో 460 గ్రూపు-2 పోస్టుల భర్తీకి ఈ సంవత్సరం ఆరంభంలో పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పోస్టులు తక్కువగా ఉన్నాయనే కారణంతో మరికొన్నింటిని కలిపేందుకు వీలుగా మార్చిలో గ్రూపు-2 పరీక్షలను వాయిదా వేసింది. ఆ తర్వాత శాఖలవారీగా అదనపు పోస్టుల నుంచి సమాచారం తీసుకుంటోంది. శాఖలవారీగా పూర్తిస్థాయిలో నివేదికలు రాలేదు. ఇదిలా ఉండగా ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వచ్చే దసరా నుంచి కొత్త జిల్లాలను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా కసరత్తులు జరుగుతున్నాయి. కొత్త జిల్లాలకు అవసరమైన పోస్టులను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించడంతో అన్ని శాఖలు తమ ప్రతిపాదనలు సమర్పించాయి. కొత్త జిల్లాల ఏర్పాటు నాటికి ఈ పోస్టులపై స్పష్టత వస్తుంది. అ తర్వాత వాటిని పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌కు పంపి భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ లెక్కన దసరా తర్వాతే గ్రూపు-2 పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
మరో ప్రకటన: టీఎస్‌పీఎస్సీ గతంలో 460 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసింది. ఆ తర్వాత పరీక్షలను వాయిదా వేసింది. ప్రభుత్వం అదనంగా పోస్టులు కలిపితే అదనంగా మరో నోటిఫికేషన్‌ ఇస్తుంది. మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించి, ఆ తర్వాత పరీక్షలను నిర్వహిస్తుంది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పోస్టుల పెరుగుదల, వాటితో కలిపే నియామకాలు జరపాలనే ప్రతిపాదన గురించి ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ వర్గాలకు సమాచారం అందినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
కొత్త జిల్లాల్లో 1500 పైనే..
కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలకు అవసరమైన గ్రూపు-2 పోస్టులు 1500కి పైనే ఉన్నాయి. పదోన్నతులు కల్పించేవి గాకుండా ఈ పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారానే భర్తీ చేయాలి. గ్రూపు-2లో గతంలో నోటిఫికేషన్‌ ఇచ్చినవి 460 పోస్టులు కాగా ఆ తర్వాత వివిధ శాఖల నుంచి సేకరించిన ఖాళీలు, తాజాగా జిల్లాలకు కలిపి మొత్తం మూడువేల వరకు చేరుకునే అవకాశం ఉంది.
ఏయే పోస్టులు?
జిల్లా కలెక్టరేట్లు, ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాలకు అవసరమైన డిప్యూటీ తహసిల్దార్లు, వాణిజ్యపన్నుల సహాయ అధికారులు, చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు, సబ్‌రిజిస్ట్రార్లు, సహాయ కార్మిక, ఉపాధి కల్పన అధికారులు, సహాయ రిజిస్ట్రార్లు. ఈ పోస్టులతో పాటు పురపాలక కమిషనర్లు, విస్తరణాధికారులు, ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, కార్యనిర్వహణాధికారులు తదితర ఉద్యోగాలు కొత్త నియామకాల్లో ఉండనున్నాయి.